ప్రజా సమస్యల పరిష్కారంలో చురుగ్గా వ్యవహరించాలి అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్

పీజీఆర్ఎస్ లో పలు సమస్యలపై 318 వినతులు సమర్పించిన ప్రజలు
విశాఖపట్టణం, సెప్టెంబర్ 07 ః ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చురుగ్గా వ్యవహరించాలని, నిర్ణీత సమయంలోగా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన వివిధ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదునూ క్షుణ్నంగా అధ్యయనం చేయాలని, సంబంధిత ఫిర్యాదుదారుతో మాట్లాడి చర్యలు తీసుకోవాలన్నారు. ఏ దశలోనూ నిర్లక్ష్యం ప్రదర్శించరాదని, పీజీఆర్ఎస్ వేదికగా అందే వినతుల పరిష్కారం కోసం ప్రత్యేక సమయం కేటాయించాలని, ప్రజలు సంతృప్తి చెందే విధంగా అధికారుల కార్యాచరణ, చర్యలు ఉండాలని కలెక్టర్ హితవు పలికారు.
ఇదిలా ఉండగా సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ వేదికగా ప్రజలు వివిధ సమస్యలపై 318 వినతులు సమర్పించారు. అందులో రెవెన్యూ విభాగానికి చెందినవి 30, జీవీఎంసీవి 71, పోలీస్ శాఖవి 26, ఇరత విభాగాలకు చెందినవి 191 ఉన్నాయి. కలెక్టర్ తో పాటు, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవో సంగీత్ మాధుర్, డిప్యూటీ కలెక్టర్ టి. గోవిందు, అడిషనల్ కమిషనర్ రమేశ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అన్ని శాఖల అధికారులు పాల్గొని వినతులను నమోదు చేసుకున్నారు.




