మాంసం మరియు కూరగాయల దుకాణాలపై లీగల్ మెట్రాలజీ అధికారుల ఆకస్మిక దాడులు, 8 కేసులు నమోదు

ఆదివారం లీగల్ మెట్రాలజీ అధికారులు పి. యం. పాలెం, కార్ షెడ్ జం. మరియు మధురవాడ పరిసరాలలో గల చేపలు మరియు మాంసం దుకాణాలపై ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో వ్యాపారస్థులు వాడుతున్న కాటాలు అన్ని శాఖా వారి టెస్టు వెయిట్ పెట్టి తనిఖీలు చేశారు మరియు కాటాలలో మోసం లేదని గుర్తించారు, కానీ కొంతమంది వ్యాపారస్థులు ప్రభుత్వ ముద్రలు లేని కాటాలు వాడుతున్నట్లు గుర్తించి వారిపై 5 కేసులు నమోదు చేశారు. తర్వాత కూరగాయల వ్యాపారస్థులు వినియోగిస్తున్న కాటాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి సీలు లేని కాటాలు వాడుతున్నట్లు గుర్తించి వారిపై 3 కేసులు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ దామోదర నాయుడు మాట్లాడుతూ మొత్తం 8 కేసులు నమోదు చేసినట్లు తెలిపి, వ్యాపారస్థులందరూ వారు వినియోగించే తూనికలు లేదా కొలతలకు ప్రభుత్వం వారిచే సకాలంలో సీలు వేయించుకోవాలని, సీలు లేని కాటాలు వ్యాపార ప్రదేశంలో ఉంచరాదని హెచ్చరించారు. వ్యాపారస్థులు కాటాలు కొత్తగా ఎవరైనా కొన్నట్లయితే ప్రభుత్వ సీలు, రసీదు మరియు సర్టిఫికెట్ ఉన్నవో లేవో చూసుకుని మాత్రమే కొనాలని సూచించారు. ఎవరైనా తూకంలో గానీ కొలతలో గానీ మోసాలకు పాల్పడవద్దని ఒకవేళ పాల్పడితే చట్టపరమైన శిక్షలు వేస్తామని వ్యాపారస్థులకు తెలియజేసారు.




